గుంటనక్కతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్..కవిత సంచలన ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
By - Knakam Karthik |
గుంటనక్కతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్..కవిత సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకే ఆయన్ను సిట్ అధికారులు విచారణకు పిలిచారని కవిత వ్యాఖ్యానించారు. విచారణకు ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందేనని, చట్టాలకు ఎవరూ అతీతం కాదని కవిత అన్నారు. నేను తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లాను. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచినా కూడా వెళ్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీయకుండా విచారణను తుది దశకు తేవాలని కవిత డిమాండ్ చేశారు.
కేసీఆర్ను విచారణకే పిలవొద్దు అంటున్న కేటీఆర్ ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరు అని కవిత మాట్లాడారు. అదే విధంగా కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. అయితే గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది. అందుకే ఈ కేసులో విచారణ పూర్తి చేస్తారని తనకు నమ్మకం లేదని కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ కేసును అటు, ఇటు తిప్పుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా కేసు ఎందుకు ముందుకుపడటంలేదని ఎద్దేవా చేశారు.