యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గట్టిగా కొడతానని అంటున్న కేసీఆర్.. గట్టిగా కొట్టాలంటే దుర్మార్గంగా ప్రజలను దోచుకున్న నీ కొడుకు, అల్లుడు, బిడ్డను కొట్టు.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తానని చెప్పుకుంటున్న ఆయన.. బయటకు వచ్చి ఏం చేస్తాడని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నువ్వు కుర్చీలో ఉన్నప్పుడు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టారు.. మళ్లీ బయటకు వచ్చి చేసేది ఏముంది అని ఘాటుగా మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. రైతులకు రుణమాఫీ చేశాం, నీవు ఎగ్గొట్టిన రైతు బంధు. మేం వేశాం' అని సీఎం రేవంత్ అన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మాదిగ ఉప కులాల వర్గీకరణ అమలు కోసం నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై సీఎం విమర్శలు చేశారు. మంద కృష్ణ మాదిగను ప్రధాని మోడీ ఎన్నో సార్లు కౌగిలించుకున్నారు, అది ధ్రుతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప, వర్గీకరణ అమలు చేయలేదు అని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఛానెళ్లు, పేపర్లు ఉన్నప్పుడే కాంగ్రెస్ను ఏమీ చేయలేకపోయారని, సోషల్ మీడియాతో ఏం చేస్తారని దుయ్యబట్టారు. యువజన కాంగ్రస్ అనుకుంటే ఒక్కసారి కాదు.. నాలుగు సార్లు గెలిపిస్తారని.. మీతో పాటు నేను కూడా సిద్ధం అని రేవంత్ మాట్లాడారు. తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వని ప్రధాని మోడీపై పోరాటానికి సిద్ధమని సవాల్ చేశారు.