వారు చెప్పేవన్ని పచ్చి అబద్దాలే.. కాంగ్రెస్పై మోదీ ఫైర్
By సుభాష్ Published on 17 Dec 2019 4:42 PM GMTదేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు సీఏఏ చట్టంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలలో లేని భయాల్ని సృష్టించి వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జార్ఖండ్లోని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీల నాయకులకు ఛాలెంజ్ విసిరారు. ఆ నాయకులకే దమ్ముంటే.. పాకిస్తానీలకు భారత పౌరసత్వం ఇస్తామని.. ఆర్టికల్ 370 తీసుకొస్తామని చెప్పాలి. అప్పుడు ఆ నాయకులను ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. భారతీయులైన ఏ ఒక్కరి హక్కును పౌరసత్వ సవరణ చట్టం హరించదని మోదీ అన్నారు.
పక్క దేశాలలో ఇబ్బందులకు, పీడనకు గురవుతున్న మైనారిటీల కోసమే ఈ చట్టం తెచ్చామని ఆయన అన్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల నుండి 2015కు ముందు వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టమని మరోమారు తెలిపారు. ఈ చట్టం వలన భారతీయుల హక్కులకు ఎలా భంగం కలుగుతుందో చెప్పాలని మోదీ ప్రశ్నించారు. లేనిపోని అపోహలతో కాంగ్రెస్ ముస్లీం ప్రజలను రెచ్చగొడుతూ.. రాజకీయంగా పబ్బం గడుపుతుందోని అన్నారు. కాంగ్రెస్ విధానాల కారణంగానే ఓ సారి దేశం ముక్కలైందని.. వారు చెప్పేవన్ని పచ్చి అబద్దాలని వ్యాఖ్యానించారు.