తెలంగాణలో ప్రతిపక్షమే లేదు, కవిత ఆరోపణలపై కేసీఆర్ జవాబు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ప్రతిపక్షమే లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
By - Knakam Karthik |
తెలంగాణలో ప్రతిపక్షమే లేదు, కవిత ఆరోపణలపై కేసీఆర్ జవాబు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షమే లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్పై ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందించారు. తమ కుటుంబంలో ఒక్కొక్కరు రూ.పది వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్లోని మంత్రులపై కవిత ఆరోపణలపై సమాధానం చెప్పాలి..అని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు ఆసక్తిగా చూస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్ నినాదంతో మంత్రులందరం యూనిటీగా పని చేస్తున్నాం. 2034 వరకు 1ట్రిలియన్ ఎకానమీ,2047 వరకు 3ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్టులు, డ్రైపోర్ట్ నుండి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నాం.
మా విజన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో పూర్తిగా 4 లేన్ల రోడ్లు రాబోతున్నాయి. మంచి రోడ్లు ఉంటే..గ్రామీణ తెలంగాణ అభివృద్ది చెందుతుంది. పరిశ్రమలు వస్తాయి.యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి బెంగళూరు, చెన్నై గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతున్నాయి. ఇది రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే మా లక్ష్యం..అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.