ఉప్పల్, మియాపూర్ ఆర్టీసీ వర్క్షాప్స్ను అమ్మకానికిపెట్టారు..హరీశ్రావు సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ పార్టీ 'చలో బస్ భవన్' కు పిలుపునిస్తే ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By - Knakam Karthik |
ఉప్పల్, మియాపూర్ ఆర్టీసీ వర్క్షాప్స్ను అమ్మకానికిపెట్టారు..హరీశ్రావు సంచలన ఆరోపణలు
హైదరాబాద్: అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ 'చలో బస్ భవన్' కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా ఆయన ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం..అని హరీశ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు. ఇప్పటికే జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద, మధ్య తరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నడు రేవంత్ రెడ్డి. మెట్రో రైలును ఆగం చేసిండు. కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా. ఇది ఇందిరమ్మ రాజ్యమా.. ఎమర్జెన్సీ పాలనా. ఇది ప్రజా పాలనా లేక ప్రజా పీడననా. రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవ్వరూ అడగొద్దు అన్నట్లు ఉంది.
ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నడు. మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ.. టికెట్ ధరల పెంపు పై బస్సులో ప్రయాణించి ఆర్టిసి ఎండిని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా. తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా పై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి.. ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నావు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటం. అడ్డగోలుగా పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. కమిషన్లు దంచుడు కాదు, పేదల కోసం పని చెయ్యి. నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆర్ టి సి ధరలు పెంచితే మెట్రో ఎక్కుతారు అని రేవంత్ ఆలోచన..ఆర్ టి సి అమ్మాలని,ప్రైవేట్ పరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ బస్ ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఉప్పల్ మియపూర్ వర్క్ షాప్స్ అమ్మకానికి పెట్టారు. బస్ స్టాండ్లు కుదువపెట్టి 1500 కోట్లు తెచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమేనా కాంగ్రెస్ పని. కార్గో ను అమ్మి ప్రైవేట్ చేయాలని చూస్తోంది. పేదల నడ్డి విరుస్తున్నారు. ఆర్టీసీ ధరలు తగ్గించే వరకు బిఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుంది..అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.