రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Knakam Karthik
Published on : 2 Jun 2025 11:58 AM IST

Telangana, Cm Revanthreddy, Telangana Formation Day, Congress, Brs, Bjp, Kcr

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలనే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదిలాం..అని సీఎం పేర్కొన్నారు.

కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకిరీని తెలంగాణ సమాజం సహించదు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళుతున్నాం. గత పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, HRC సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం..అని రేవంత్ మాట్లాడారు.

అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు:

తెలంగాణ సమాజానికి పునాది మహిళలే. అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలామహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టాం. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలా మారి సగర్వంగా నిలబడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..అని సీఎం పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం:

రాష్ట్రానికి రైతే వెన్నెముక. అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. కేవలం ఎనిమిది నెలల్లో 25లక్షల, 35వేల,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నాం. రూ.15,333 కోట్లతో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నాం..అని సీఎం అన్నారు.

Next Story