సీఎం రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చింది, మోడీని తిడితే ఏమైందో కేసీఆర్‌కు తెలుసు: ఈటల

సీఎం రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రధాని మోడీ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈటల ఘాటుగా స్పందించారు.

By Knakam Karthik  Published on  15 Feb 2025 9:21 AM IST
Telangana, CM RevanthReddy, Bjp Mp Eatala Rajender, Kcr, Congress, Brs, Bjp

సీఎం రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చింది, మోడీని తిడితే ఏమైందో కేసీఆర్‌కు తెలుసు: ఈటల

సీఎం రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రధాని మోడీ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈటల ఘాటుగా స్పందించారు. మోడీని తిడితే ఏమైతుందో కేసీఆర్‌కు తెలిసిందని.. త్వరలోనే రేవంత్‌కు తెలుస్తుందని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. భారత దేశంలో మోడీని విశ్వసించని, ప్రేమించని వారు లేరని, పేదరికం నుంచి వచ్చిన వాడిని, పేదల బాధలు అన్ని తెలుసు, అందులో పీహెచ్‌డీ చేశానని మోడీ ఎన్నోసార్లు చెప్పారు అని ఎంపీ ఈటల చెప్పారు.

అప్పుడు కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కి మోడీ, గీడీ అని మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ ఢిల్లీకి పోయి మోడీ గారిని పెద్దన్న అంటారు, కేంద్రం సాకారం కావాలని అడుగుతూనే.. తెలంగాణకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. మోడీ బీసీ కాదు అని మాట్లాడుతున్న రేవంత్.. ఆయన కులాలకు అతీతం, భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ పటం నిలబెడుతున్న వ్యక్తి అని కొనియాడారు. అమెరికన్ ప్రెసిడెంటే కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు అని ఈటల అన్నారు.

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉంది అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ఎంపీ ఈటల విమర్శలు చేశారు. మోడీపై విమర్శలు సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లు ఉన్నాయని అన్నారు. మోడీకి స్వార్థం లేదని, దేశ ప్రజలే ఆయన కుటుంబం అని ఈటల చెప్పారు. ఆయన మీద విమర్శ చేస్తే ప్రజలు గతంలో వారికి చెప్పిన బుద్ధే మీకు చెప్తారు అంటూ రేవంత్‌పై మండిపడ్డారు. ఆ నిమిషానికి చప్పట్లు కొట్టవచ్చు కానీ.. తర్వాత పర్యవసానాలు కేసీఆర్‌కు అర్థమయ్యాయి.. మీకూ అర్థం అవుతాయని.. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.

Next Story