తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజలను, ఉద్యోగులను గాలికొదిలేసిందని విమర్శించారు. క్యాబినెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కానీ, ఇతర హామీలపై కానీ కనీస చర్చ జరగలేదని ఆరోపించారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు కానీ, ఢిల్లీలోని నకిలీ గాంధీ కుటుంబానికి మాత్రం వేల కోట్లు పంపిస్తున్నారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీకి నిధుల మూటలు మోయడానికే పరిమితమయ్యారని, పాలనపై దృష్టి పెట్టడం లేదని ఎద్దేవా చేశారు.