ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం భేటీ
Mamata meets PM Modi in Delhi. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం న్యూఢిల్లీలో
By - Medi Samrat |
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. మమతా తన రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీ బకాయిలతో సహా పలు సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ నాలుగు రోజుల న్యూ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా మమతా బెనర్జీ సమావేశం కానున్నారు.
గురువారం మమతా బెనర్జీ ఢిల్లీలో టీఎంసీ ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చర్చించాల్సిన అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ, మోదీల భేటీపై చర్చ జరుగుతుంది.
ఆగస్టు 7న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశం కావచ్చని సమాచారం. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న సోనియా గాంధీని కూడా బెంగాల్ సీఎం మమతా కలవనున్నారు.