కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. యువనేత, కేంద్ర మాజీమంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో జితిన్ ప్రసాద భేటీ అయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. మరికొద్ది రోజుల్లో యూపీ ఎన్నికలు జరుగనున్న వేళ జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం సంచలనమైంది. జితిన్ ప్రసాద.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడు.
జితిన్ ప్రసాద తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. 2001లో యూత్ కాంగ్రెస్లో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జితిన్ ప్రసాద.. 2004 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్పూర్ నుంచి పోటీ చేశారు. యూపీఏ హయాంలో మన్మోహన్ కేబినెట్లో జితిన్ ప్రసాద మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ను వీడుతూ.. జితిన్ ప్రసాద పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని అన్నారు. బీజేపీ మాత్రమే జాతీయ పార్టీ అని.. మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని అన్నారు. జితిన్ ప్రసాద బీజేపీలో చేరికపై కాంగ్రెస్ స్పందించాల్సివుంది.