కేసీఆర్ 1+1 స్కీం ఏంటో తెలుసా?
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 July 2020 10:32 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్లోని తెలంగాణ పాత సచివాలయంను కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని ఆయన తలపోయడం, అనేక కోర్టు కేసుల అనంతరం గ్రీన్ సిగ్నల్ దక్కడంతో ప్రస్తుతం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సచివాలయానికి సంవత్సరం క్రితం భూమి పూజ నిర్వహించగా ఇప్పుడు సచివాలయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో, సహజంగానే టీఆర్ఎస్ వర్గాలు సంతోషంగా ఉండాలి. కానీ తమ అధినేత ఈ ప్రక్రియలో నిందలు పడటం తప్పదంటున్నారు.
ప్రపంచం, దేశం, రాష్ట్రం అంతా కరోనా బారిన పడి ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగస్తులకు సగం జీతాలు చెల్లిస్తోంది. మరోవైపు, నిధులకు సంబంధించిన అంశాలన్నింటిలోనూ కట్టడి చేసింది. ఇలాంటి సమయంలో భారీగా ఖర్చు పెట్టి కొత్త సమయం నిర్మించడం అవసరమా? అన్నది తెలంగాణలోని అనేకమంది సందేహం. మరోవైపు, సీఎం ఎక్కడి నుంచి పనిచేస్తే అదే సచివాలయం అని గతంలోనే కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ పేరు మీద భారీ భవంతి నిర్మించారు. అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం సహజంగానే ప్రజల్లో సందేహాలకు అవకాశం కల్పిస్తుంది. ఇంత భారీ ఖర్చుతో సచివాలయం అవసరమా అని తెలంగాణ ప్రజలు డౌట్ పడటం సహజం. కరోనాతో మనుషులు చనిపోతుంటే కేసీఆర్ చేతులు ఎత్తివేశారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడుకోవాలి కానీ కొత్త సచివాలయ నిర్మాణం తెరమీదకు రావడం తమపై విమర్శలు చేసేవారికి చాన్చిచ్చినట్లేనని టీఆర్ఎస్ శ్రేణులు మథనపడుతున్నట్లు సమాచారం.