భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pawan Kalyan Sensational Comments On YSRCP. రిపబ్లిక్ చిత్ర వేడుకలో టాలీవుడ్ న‌టుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Medi Samrat  Published on  26 Sep 2021 3:33 AM GMT
భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రిపబ్లిక్ చిత్ర వేడుకలో టాలీవుడ్ న‌టుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఆపేస్తే.. అతను భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నామ‌ని.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదని.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదని ఫైర్ అయ్యారు. జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి, ఒళ్లువిరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయని తెలిపారు.

కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా? అని ప్ర‌శ్నించారు. చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారు.. ప్రభావం మాత్రం చాలా పెద్దదని హెచ్చ‌రించారు. చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుక్కూర్చోమని చెప్పలేరా.. ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా.. అని ప్ర‌శ్నించారు. సినిమావాళ్ల కష్టాలపై మోహన్ బాబు మాట్లాడాలని అన్నారు. చిత్ర పరిశ్రమ గురించి మోహన్ బాబు వైసీపీ నేతలకు చెప్పాలని.. ఇవే నిబంధనలు రేపు మోహన్ బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయని అన్నారు. భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ అని.. వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారని.. అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని.. గఢాఫీ లాంటి నియంతల్నే చేసిన తప్పులు వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్లు కొట్టి చంపేశారని ప‌వ‌న్ అన్నారు. మీడియా దృష్టి పెట్టాల్సింది సినిమా వాళ్ల మీద కాదు.. అక్రమ అర్జిత రాజకీయ నాయకుల మీద అని చెప్పారు. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన అంశం.. అందుకే చాలా తేలిగ్గా టార్గెట్ చేసేస్తున్నారు.. ఉదాహరణకు తేజుకి బైక్ యాక్సిండెట్ అయితే దాని మీద విపరీతార్ధాలతో కథనాలు వేశారు. దేశంలో ఇంతకంటే ఇంట్రస్టింగ్ కథనాలు లేవా? వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు అనే దాని మీద మాట్లాడండి. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో పోడిస్తే నాటి గవర్నర్ సైతం దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు.. అది ఏమయ్యిందో అడగండి.. లక్షలాది ఎకరాల పోడు భూముల్లో గిరిజనలు వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు.. ఎందుకు దక్కడం లేదనే అంశం మీద మాట్లాడండి.. ఆరేళ్ల చిన్నారిని అన్యాయంగా, అమానుషంగా హ్యత చేస్తే దాన్ని వదిలేసి తేజ్ 45 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లిపోయాడు అనే దాని మీద కథనాలు ఎందుకు? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స్పైసీగా కథనాలు కావాలి అంటే ఈ మధ్య వైసీపీ సానుభూతిపరులు కొందరు వ్యభిచారాన్ని చట్టబద్దం చేయమంటూ బయటకు వచ్చారు. దాని మీద కథనాలు నడపండని మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి.. వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనే అంశం మీద కథనాలు వేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో కథనాలు వేయండి.. బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదో దాని మీద కథనాలు నడపిండి.. నేను గౌరవిస్తాను. ఇడుపులపాయలో ఉన్న నేలమాళిగల్లో టన్నుల కొద్ది డబ్బుల కట్టలు ఉంటాయని పోలీసు వారు చెప్పుకుంటుంటే విన్నా దాని మీద కథనాలు నడపండి.. అలా నడిపితే వాళ్లు ఇళ్లలోకొచ్చి కడతారు.. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు తేజ్ యాక్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అతను అమాయకుడు ఏం చేయలేడు కాబట్టి.

సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారు.. సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదు. ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నంపెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండి. చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండని పిలుపు నిచ్చారు. నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరారు. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్షల మంది బతుకుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదని స్ప‌ష్టం చేశారు.

ఇక సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరమ‌ని ప‌వ‌న్ అన్నారు. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయితేజ్ అని అన్నారు. సాయితేజ్ ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చాన‌ని.. అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారని.. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడని అన్నారు. సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలుచేయడం కష్టమ‌ని.. సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని, కళ్లు తెరవలేదని అన్నారు. రాజకీయాల్లో దిగజారుడుతనం పెరుగుతోందని.. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.


Next Story