ఇంటలిజెన్స్ హెచ్చరికలతో రాజధానిలో 'హై అలర్ట్'
By సుభాష్ Published on 18 Dec 2019 9:41 AM GMTపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మరింత హంసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఈ నేపథ్యంలో మరింత అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ హెచ్చరికలపై ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్, అన్ని జిల్లాల డీసీపీలు, జాయింట్ కమిషనర్ల సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని శీలంపూర్, ముస్తఫాబాద్ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.
ఢిల్లీ నగరంలోని 12 సున్నితమైన ప్రాంతాల్లో ఈ వారం రోజుల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో నగరంలోని 12 సున్నిత ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఉన్న అమన్ కమిటీ సభ్యులతో కలిసి పోలీసులు అల్లర్లు జరగకుండా పెట్రోలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురి, జామియానగర్, షమియానాస్, జామా మసీదు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగకుండా నివారించేందుకు వీలుగా మఫ్టీలో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో జనాలు గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నారు. భారీ ఎత్తున ప్రత్యేక భద్రతా బలగాలు మొహరించాయి. ఎలాంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.