అంతా అబద్దం.. అలాంటిదేమి లేదు: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
By సుభాష్
ప్రస్తుతం కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండిగో, ఏయిర్ ఇండియా లాంటి విమాన సంస్థలు వచ్చే నెలలో విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విమాన సర్వీసుల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటి వరకూ మంత్రిత్వశాఖ విమాన ప్రయాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎయిర్లైన్స్ సంస్థలు బుకింగ్ ప్రారంభించాలని ఆయన తెలిపారు. మరో వైపు మే 4వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఇప్పటికే ఎయిర్ ఇండియా బుకింగ్లను ప్రారంభించింది. అలాగే జూన్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
అయితే దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 3వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో బుకింగ్కు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటామని ఎయిర్ ఇండియా తన వెబ్ సైట్లో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దేశ వ్యాప్తంగా, చైనా అంతర్జతీయ మార్గాలకు వైద్య సామాగ్రి తరలింపు కోసం విమాన సర్వీసులను నడుపుతోంది.