గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం చారిత్రక తప్పిదం : చ‌ంద్ర‌బాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 2:11 PM GMT
గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం చారిత్రక తప్పిదం : చ‌ంద్ర‌బాబు

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. ఆ అంశంపై ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. ప్రపంచ చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవని చంద్రబాబు అన్నారు. గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదమ‌ని.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని అభివ‌ర్ణించారు.

కరోనా వల్ల తిండి కూడా లేకుండా ఎంతోమంది అలమటిస్తున్నారని.. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల మధ్య చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని.. ఇది జగన్ ది పైశాచిక ఆనందమ‌ని చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అమరావతి కోసం డబ్బులు పెట్టి భూములు కొనలేదని.. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని చెప్పారు. మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అమరావతి పూర్తయ్యేదని.. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని.. ఈ విషయంపై ప్రజలంతా ఆలోచించాలని అన్నారు.

అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని, వరదలు, భూకంపం ముప్పు ఉందని, ఇలా రకరకాల అపవాదులు వేసి పక్కదారి పట్టించారని మండిపడ్డారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

శాసనమండలి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ అని.. మూడు రాజధానుల బిల్లును మండలి ఆమోదించలేదని చంద్రబాబు అన్నారు. బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉందని హైకోర్టుకు కూడా చెప్పారని.. కానీ, ఇలా ఆమోదించుకోవడం దుర్మార్గమని విమర్శించారు.

Next Story