వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Sept 2020 7:05 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ ప్రారంభించింది. జులైలో రెండు వారాల పాటు కడప, పులివెందులలో పలువురు అనుమానితుతలను విచారించిన సీబీఐ దాదాపు 40 రోజుల తర్వాత మళ్లీ పులివెందులకు చేరుకుంది. ఢిల్లీ నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. ఆర్అండ్బీ అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.
గతంలో జులై 13న కడపకు వచ్చిన అధికారులు జులై 30 వరకు విచారణ జరిపారు. జులై 31న కడప నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పుడు పులివెందులలోని వివేకా ఇంట్లో కేసు రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు వివేకా కుమార్తె సునీతను, పలువురు అనుమానితులను విచారించారు.
అందులో సస్పెండ్ అయిన పులివెందుల సీఐ శంకరయ్యతో పాటు పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మీదేవి సహా పది మందికి పైగా అనుమానితులు ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం.. 15 మంది అనుమానితులు ఉండగా.. ఇప్పటివరకు వారిలో ఐదుగురిని మాత్రమే విచారించారు. రెండవ విడత విచారణలో భాగంగా మిగిలిన వారిని విచారించనున్నట్లు తెలుస్తోంది.