అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 01 వరకు రాష్ట్రంలో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. అలాగే రైతులకు కొన్ని ముఖ్య సూచనలు చేసింది. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలి. పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలి. ధాన్యం తడిసి రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలి. తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలి.