నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 May 2020 3:05 AM GMTసీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ వేధికగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరుగనుంది. 7వ తేదీతో తెలంగాణలో లాక్డౌన్ ముగియనున్న నేఫథ్యంలో.. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 7వ తేదీ నుండి మరో రెండు, మూడు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా ? గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేయనున్నారా.. తదితర ఊహాగానాలకు కొద్ది గంటల్లో సమాధానం రానుంది.
ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు లాక్ డౌన్ పొడిగించింది. చివరగా.. మే 3వ తేదీ వరకు ఉన్న లాక్డౌన్ను మే 17 వరకు పొడిగించింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. మే 3వ తేదీ వరకు కాకుండా.. మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. గడిచిన నాలుగు, ఐదు రోజులలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ ఎత్తివేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఇదిలావుంటే.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్న ప్రాంతాలపై సీఎంకు ఇచ్చిన నివేదికపై ఈ భేటీలో విస్తృత చర్చ జరుగనుంది. కేబినెట్ లోనే లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలా? సడలించాలా?.. వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? తదితర అంశాలను చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.