ఉన్న నగరాన్ని ఉద్ధరించరు కానీ కొత్త సిటీ కడతారా?: కేటీఆర్

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By -  Knakam Karthik
Published on : 29 Sept 2025 2:46 PM IST

Telangana, Hyderabad News, Ktr, Brs, Congress, Cm Revanth, Local Body Elections

ఉన్న నగరాన్ని ఉద్ధరించరు కానీ కొత్త సిటీ కడతారా?: కేటీఆర్

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరితోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే, గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయారని అనుకుంటుంది. కానీ 'గ్యారెంటీల' పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదు.

సమాజంలోని రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల అందరికీ హామీలు ఇచ్చి, కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు మేము 'బాకీ కార్డులను' తీసుకువచ్చాము. ఈ 'బాకీ కార్డుల' ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి, మనిషికి చేర్చడానికి ఈ 'బాకీ కార్డుల' ఉద్యమాన్ని తీసుకున్నాము. ఈ కాంగ్రెస్ 'బాకీ కార్డులు' ఇంటింటికి తీసుకుపోతే, అదే కాంగ్రెస్ పాలనలో బ్రహ్మాస్త్రం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అభయహస్తం, బస్మాసుర హస్తం అని తేలిపోయింది. హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. గత 22 నెలలుగా హైదరాబాద్ నగరంలో ఉన్న రోడ్లను కూడా కనీసం నిర్వహించలేకపోతున్నది. హైదరాబాద్ నగరానికి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి, మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనకు ఓటు వేసి గెలిపిస్తారు అన్న నమ్మకం ఉన్నది..అని కేటీఆర్ అన్నారు.

మా పార్టీ మీద గెలిచిన గద్వాల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వెంటబోయిన మా పార్టీ నాయకుడు, అచ్చంపేట నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ సునామి అని ప్రజల నుంచి స్పందన వస్తుంది. రాబోయే ఎన్నికల్లో కెసిఆర్‌ను తిరిగి తెచ్చుకోవడం కోసం అన్న స్పష్టమైన ఆలోచన ప్రజల్లో కనిపిస్తున్నది. ఇది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి, తిరిగి ప్రజల సంక్షేమ, అభివృద్ధి పాలన కేసీఆర్ సారథ్యంలో తీసుకురావాలన్న ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినంక వచ్చింది. రైతులు గ్రామాల్లో ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసం పైన కోపంగా ఉన్నారు. నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వృద్ధులను మోసం చేశారు. పెన్షన్ దారులంతా కోపంగా ఉన్నారు. యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులు, విద్యార్థినులకు స్కూటీ అంటూ యువత, విద్యార్థులు కాంగ్రెస్ పైన కోపంగా ఉన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే, రేవంత్ రెడ్డి మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి లాగా ఉన్నాడు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ, కొత్త నగరాన్ని కడతానని ఫోజులు కొడుతున్నాడు. నగరంలో కనీసం మోరీలు శుభ్రపరిచే పరిస్థితి లేదు, వీధి దీపాలు వెలిగించే పరిస్థితి లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త నగరం కడతానని పోజులు కొడుతున్నాడు..అని కేటీఆర్ విమర్శించారు.

Next Story