హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో చిట్చాట్లో మహేశ్ మాట్లాడారు. నీటి విషయంలో కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్లో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను కాంగ్రెస్లోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. కవిత కేసీఆర్ కూతురు, ఆమె బయటకు వచ్చి కుటుంబంపై ఆరోపణలు చేస్తుందని దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందని ...అని మహేశ్ కుమార్ అన్నారు.
కాగా జిల్లాల్లో కాంగ్రెస్ కమిటీలపై కూడా టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన చేశారు. పది నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య గొడవలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాకు కమిటీ వేస్తామన్నారు. కమిటీలో ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, సీనియర్లు ఉంటారని చెప్పారు.
ఇక ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు ఆలోచించాలని మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఆలోచించండి, ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ప్రకటించారు.