రాజకీయ వేధింపుల కోసమే కేసు.. ఈడీ విచారణకు ముందు కేటీఆర్ ట్వీట్
ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik
రాజకీయ వేధింపుల కోసమే కేసు.. ఈడీ విచారణకు ముందు కేటీఆర్ ట్వీట్
ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని దుయ్యబట్టారు. ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Hosting Formula E in India/Telangana/Hyderabad remains one of my most cherished decisions as a Minister. The pride I felt, witnessing international racers & E-Mobility industry leaders praise our city, is memorable
— KTR (@KTRBRS) January 16, 2025
No amount of frivolous cases, cheap mudslinging, or political…
ఈ రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తినట్టు కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని ఆయన ఎక్స్లో చెప్పారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్ల వేళలా ముఖ్యమైన అంశంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపిందని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు రాసిన కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.46 కోట్లు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందని, ఒక్క రూపాయి కూడా వృథా కాలేదని, ప్రతి పైసాకు లెక్క ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలోనే తెలుసుకుంటాయని ట్వీట్ చేశారు కేటీఆర్. అప్పటి దాకా న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రాసుకొచ్చారు.