తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారని కేటీఆర్ తరపు లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును కూడా న్యాయస్థానానికి వివరించారు.
ఈ క్రమంలో అసెంబ్లీ మారిన కార్యదర్శి తరపు లాయర్ ముకుల్ రోహత్గీ కలుగ జేసుకుని ఎమ్మెల్యేలపై అనర్హతకు రీజనబుల్ సమయం కావాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం మరోసారి తీవ్రంగా సీరియస్ అయింది. ఇప్పటికే 10 నెలల సమయం గడిచిందని.. అది రీజనబుల్ టైమ్ కాదా అని మండిపడింది. అందుకు ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. తమ నిర్ణయాన్ని తెలిపేందుకు మరో నాలుగైదు రోజుల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కేసులో తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.