హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్లోని ఆయన నివాసానికి సిట్ అధికారులు చేరుకుని ప్రశ్నిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు, సాంకేతిక పరికరాలతో సిట్ బృందం కేసీఆర్ ఇంటికి వెళ్లినట్లు సమాచారం. విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు.
కేసీఆర్ నివాసంలోకి కుటుంబ సభ్యులు మరియు సిట్ అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. పార్టీ శ్రేణులు, అనుచరులు లోపలికి రావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది