డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడ‌తాం

కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని..

By Medi Samrat  Published on  12 Oct 2023 11:04 AM GMT
డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడ‌తాం

కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని.. 4 కోట్ల ప్రజలను మోసగించినట్లే కేసీఆర్.. సోనియాగాంధీని మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. అందుకే సెప్టెంబర్ 17న సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామ‌న్నారు.

తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారని.. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్ర‌శ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చింది కాంగ్రెస్.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించింది కాంగ్రెస్ అని వివ‌రించారు. కేటీఆర్.. మీరు అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన బిక్ష.. సోనియమ్మ దయ.. అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌ నాయకులను హెచ్చరిస్తున్నా.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని అన్నారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని.. కాంగ్రెస్ కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు.

కేటీఆర్ కాంగ్రెస్ కు సాయం చేస్తున్న 75 మంది లిస్టును తయారు చేశారట.. ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఇచ్చారు. కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారట.. బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో.. నీ అధికారం 45 రోజులే.. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తామ‌న్నారు.

అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించండి.. బీఆరెస్ కార్యకర్తల్లా కాదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలారా 45రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదేన‌న్నారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.. ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్ లా మాట్లాడుతున్నారని.. నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు.. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం.. మీరు సిద్ధంగా ఉన్నారా అని స‌వాల్ విసిరారు.

Next Story