పోయే కాలం వచ్చింది కాబట్టే ఆర్మీ జోలికి వెళ్లారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On Center Over Agneepath Scheme. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు

By Medi Samrat  Published on  27 Jun 2022 11:05 AM GMT
పోయే కాలం వచ్చింది కాబట్టే ఆర్మీ జోలికి వెళ్లారు : రేవంత్ రెడ్డి

ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ స‌ద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి పోయే కాలం వచ్చింది కాబట్టే ఆర్మీ జోలికి వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీల కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చినట్లుగా ఉందన్నారు. జవానుగా 4 ఏళ్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. అగ్నివీర్‌లు నాలుగేళ్లకే మళ్లీ నిరుద్యోగి అవుతారన్నారు. పోలీసులకే 9 నెలల ట్రైనింగ్ ఇస్తుంటే.. జవాన్లకు 6 నెలల శిక్షణ ఎలా సరిపోతుందని రేవంత్ ప్రశ్నించారు.

ఆరు నెలల శిక్షణతో అగ్నివీర్‌లు శత్రు దేశాలను ఎలా ఎదుర్కొంటారని రేవంత్ కేంద్రాన్ని నిలదీశారు. ఇజ్రాయిల్ విధానం ఫాలో అవుతున్నామని చెప్పడం సిగ్గు చేటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోటి జనాభా లేని దేశంతో భారత్ ను పోల్చడం దారుణమని మండిపడ్డారు. ఇజ్రాయిల్ దేశ జనాభా గ్రేటర్ హైదరాబాద్ జనాభా కంటే తక్కువ అన్నారు. ఇజ్రాయిల్ లో నిరుద్యోగ సమస్యలేదని.. మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నిరుపేద పిల్లలే ఆర్మీ వైపు వస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

రెండేళ్ల క్రితం ఫిజికల్ టెస్ట్ పాసైన అభ్యర్థులకు రాత పరీక్ష పెట్టకుండా రద్దుచేయడం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందన్నారు. రాకేష్ శవయాత్రను టీఆర్ఎస్ నేతలు రాజకీయ యాత్రగా మార్చారని విమర్శించారు. దేశాన్ని కాపాడాలనుకున్న పిల్లలపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం సరికాదన్నారు. స్పెషల్ కోర్టు ద్వారా అసలు దోషులను శిక్షించి అమాయకులను వదిలేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.

ప్రధాని మోదీ హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ దీక్షకు దిగాలని.. అగ్నిపథ్ పై నిలదీయాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని అన్నారు. రైతు చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఎలా పోరాటం చేశామో.. అలాగే అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆర్మీ అభ్యర్థులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.















Next Story