ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఈసీ..!
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
By Medi Samrat Published on 30 Nov 2023 4:48 PM IST
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ సమయానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ఓటర్లను మాత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.. ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీనికి ఎగ్జిట్ పోల్స్ ద్వారా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని ఇంతకు ముందు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ సమయాన్ని ఈసీ సవరించింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించవచ్చని తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయింది. తెలంగాణలో కూడా పోలింగ్ పూర్తి కానుండటంతో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. తెలంగాణలో ఈరోజు 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.