ఆంధ్రాలో బీజేపీ బీ టీమ్లు వైసీపీ, టీడీపీ, జనసేన అయితే.. ఇక్కడ బీఆర్ఎస్
బీజేపీ వాళ్లకు మోకాళ్ళ లో మెదడు ఉందని.. వాళ్ళ బుద్ధి లో మార్పు రావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.
By Medi Samrat
బీజేపీ వాళ్లకు మోకాళ్ళ లో మెదడు ఉందని.. వాళ్ళ బుద్ధి లో మార్పు రావడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ వాళ్ళు దిట్ట.. నియంతలకు అబద్దాల మీద బాగా ప్రేమ ఉంటుందన్నారు. చాలా జోక్గా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం అవుతుందని ప్రశ్నించారు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. ఎవరి వర్గం నువ్వు.. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరి వర్గం నువ్వు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీసి నిన్ను పక్కకు పెట్టినప్పుడు కూడా ఇన్ని మాటలు మాట్లాడలేదు కదా ఈటెల రాజేందర్.. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరు చెప్పారు నీకు.. జూన్ 2 లేదా డిసెంబర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాకపోతే బీజేపీని రాష్ట్రంలో నిషేధిస్తారా.. మాతో పోరాటం మీకు చేత కావడం లేదా.. అని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే.. అందుకే బీజేపీని రాష్ట్రంలో జనాలు తొక్కి పెట్టారన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఇలాగే కారు కూతలు కూశావు.. అప్పుడు ఏమైందో నీకు తెలుసు.. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నీతో ఎవరు మాట్లాడించారు చెప్పు అని మండిపడ్డారు. ఈ టర్మ్ కాదు వచ్చే టర్మ్ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని బీజేపీ వాళ్లకు క్లారిటీ ఉందని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారన్నారు.
ఎప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవదు.. అది రాహుల్ గాంధీ చెప్పారు.. బీజేపీతో బీఆర్ఎస్కు చీకటి రాజకీయ ఒప్పందం ఉందన్నారు. బీఆర్ఎస్ గెలవని చోట బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఆంధ్రాలో బీజేపీకి బీ టీమ్లు వైసీపీ, టీడీపీ, జనసేన.. ఇక్కడ బీఆర్ఎస్.. కమలం కాడకు గులాబీ పువ్వును అంటు కట్టారన్నారు.
ఇదిలావుంటే.. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని సంచలనమైన దావా చేశారు. ఈ పరిణామంతో రాష్ట్రానికి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని చెప్పారు. విలీన ప్రక్రియ జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత జరగవచ్చని అంచనా వేశారు. "తెలంగాణ పునర్విభజన దినోత్సవం (జూన్ 2) లేదా తెలంగాణ ఉద్యమానికి చిహ్నమైన డిసెంబర్ 9న ఈ విలీనం ప్రకటించవచ్చు" అని అన్నారు.