గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు

గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

By Knakam Karthik
Published on : 15 July 2025 3:38 PM IST

Telangana, Cm Revanth Reddy, Congress Government, Gurukul Schools, Ktr, Brs

గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు

గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరకాలంలో గురుకులాల్లో వెయ్యికి పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగినట్లు వచ్చిన నివేదికపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సంవత్సర కాలంలో వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్‌కు గురవడం, 100 మందికి పైగా విద్యార్థులు చనిపోవడం ప్రభుత్వ పూర్తిస్థాయి వైఫల్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఈ సంఘటనలు జరిగిన తరువాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రేవంత్ నియంతృత్వ అమానవీయ పాలనకు నిదర్శనం. రేవంత్ రెడ్డి ఇంత మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా, ఆత్మహత్యలు చేసుకున్నా, మరణాల పాలయ్యినా పట్టించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం. గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చాను. ఈ అంశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిసారి రాష్ట్ర మంత్రులు కంటి తుడుపు చర్యలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోలేదు...అని కేటీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతటి అమానవీయ సంఘటనలపై చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క సమీక్ష చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోయారు. పిల్లలు కలిగిన ఒక తండ్రిగా అడుగుతున్న… ఈ అంశంలో ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం ఒక తండ్రిగా అయినా రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఇదే పరిస్థితి ముఖ్యమంత్రి పిల్లలకు జరిగితే కూడా ఇలానే వదిలేస్తారా? దయచేసి ముఖ్యమంత్రి ఈ అంశాన్ని గంభీరంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు నష్టపోతే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలకు ప్రభుత్వం విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటారా? ఇన్ని దారుణాలు జరుగుతున్నా బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరినీ ఉరితీయాలో చెప్పాలి..అని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story