తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం అయ్యారంటూ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని చెప్పే రాహుల్ గాంధీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
"బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటి ?
ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు.
ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం
ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలి
పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం
కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, BJP ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా ?
అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది
ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. రెండు ఢిల్లీపార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తది" అంటూ ట్విట్టర్ లో కేటీఆర్ పోస్టు పెట్టారు.