హైదరాబాద్: జూబ్లీహిల్స్ బైపోల్స్ కోసం అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ రెహమత్నగర్ డివిజన్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..బిహార్ ఎలెక్షన్తో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ 30 వేల మెజార్టీతో విజయం సాధించాలి. బతుకమ్మ పండగకి జోర్దార్ పాటలు రాబోతున్నాయి. గల్లి , గల్లిలో బతుకమ్మ పాటలు దద్దరిల్లాలి. వినాయక నిమజ్జనం రోజు సచివాలయం దగ్గర కేసీఆర్ పాటలతో హోరెత్తించారు. సర్దార్ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు గోపీనాథ్ అండగా ఉన్నాడు. ఈరోజు గోపినాథ్ కుటుంబానికే కష్టం వచ్చింది , జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరు గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలి..అని కేటీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళు కూలగొట్టడమా ? కూకట్ పల్లిలో ఇల్లు కులగొడతాము అని స్టిక్కర్ వేసినందుకు బుచ్చమ్మ అనే వృద్ధ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మాదాపూర్ లో ఉండే రేవంత్ రెడ్డి, బ్రదర్ తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా వెళ్ళదు. పేదోళ్ల ఇంటికి మాత్రం హైడ్రా వెళ్తుంది. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచి తీరాల్సిందే..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.