ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి

బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.

By Knakam Karthik
Published on : 8 Jun 2025 5:39 PM IST

Hyderabad News, Maganti Gopinath, Funeral, Brs, kcr, Ktr, Harishrao

ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి

బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో కేటీఆర్, హరీశ్ రావు తదితరులు పాడె మోశారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు.

మాగంటి గోపీనాథ్ గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు నిర్ధారించారు. వెంటనే సీపీఆర్ చేయడంతో గుండె స్పందించింది. అనంతరం నాడీ, రక్తపోటు సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

అయితే, మాగంటి గోపీనాథ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా పోరాడుతున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఆయన ఏఐజీ ఆసుపత్రిలోనే చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. గుండెపోటుతో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం ఉదయం 5:45 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story