ఆ అంశంలో ప్రస్తుత కథానాయకుడు ఆయనే కానీ..హీరో మాత్రం ఈయనే: కేకే
డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు.
By Knakam Karthik
ఆ అంశంలో ప్రస్తుత కథానాయకుడు ఆయనే కానీ..హీరో మాత్రం ఈయనే: కేకే
డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వస్తున్న డీలిమిటేషన్ విధానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ విధానంపై అన్ని రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ విధానం ద్వారా దక్షిణాదిలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరగాలి గాని తగ్గకూడదు అని ఆశించారు. పార్లమెంటు ఆమోదంతోనే చట్టం చేయాలి తప్ప, మొండిగా ముందుకు వెళ్లకూడదు అని పేర్కొన్నారు. ఇది సీట్ల గురించి పోరాటం కాదని, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉండాలన్నదే అభిప్రాయం అని తెలిపారు.
డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుత కథానాయకుడు స్టాలిన్ అయినప్పటికీ... హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని అన్నారు. హైదరాబాద్ లో సభ పెడతామని చెప్పడం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కీలక పరిణామమని చెప్పారు. ఈ సభ రాజకీయ అజెండాను మలుపు తిప్పే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశంపై దక్షిణాది నేతలు అంతా ఒక్కటి కావాలని.. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేకే వెల్లడించారు. జనాభా ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆదాయం ఎక్కువ, జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ సీట్ల పెంపు గురించి మాత్రమే ఉండకూడదని అన్నారు. జనాభా గణన జరిగిన తర్వాత ప్రతిసారి ఇదే వివాదం తెరపైకి వస్తుందని చెప్పారు. పార్లమెంట్ లో ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. స్టేట్ లిస్ట్ ను తగ్గించి, సెంట్రల్ లిస్ట్ ను పెద్దది చేశారని మండిపడ్డారు. దీని ఫలితంగా రాష్ట్రాల హక్కులు తగ్గిపోతున్నాయని చెప్పారు. జమ్మూకశ్మీర్, అసోం వంటి ప్రాంతాల్లో సీట్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారని... దక్షిణాదికి అన్యాయం జరిగేలా అడుగులు వేస్తున్నారని కేకే మండిపడ్డారు. అమిత్ షా వంటి వ్యక్తుల మైండ్ సెట్ తో సమస్యలు పరిష్కారం కావని కేకే చెప్పారు.