రైతులను గోస పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు..

By Knakam Karthik
Published on : 20 Jun 2025 1:42 PM IST

Telangana, Harishrao, Congress Government, Brs, Cm Revanthreddy, Brs

రైతులను గోస పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.. సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది.. సన్న వడ్ల బోనస్ పై సన్నాయి నొక్కులేనా.. అని హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. యాసంగి లో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. సన్‌ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతోందని విమర్శించారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్‌ఫ్లవర్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని తెలిపారు.

వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ. 1,116 కోట్ల సన్నాల బోనస్ డబ్బులతో పాటు సన్‌ఫ్లవర్ రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన మీరు.. పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారని తెలిపారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందన్నారు. పంట పెట్టుబడి సహాయం అందించడంలో వైఫల్యం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం, ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు.

Next Story