స్కూళ్లు, కాలేజీలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే సెలవులు ఇచ్చాక కూల్చేస్తాం : ఎంపీ మల్లు రవి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బంగారు తెలంగాణ అని మాట్లాడిన కేసీఆర్ హైదరాబాద్ లో చెరువులని పట్టించుకోలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు

By Medi Samrat  Published on  28 Aug 2024 1:38 PM GMT
స్కూళ్లు, కాలేజీలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే సెలవులు ఇచ్చాక కూల్చేస్తాం : ఎంపీ మల్లు రవి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బంగారు తెలంగాణ అని మాట్లాడిన కేసీఆర్ హైదరాబాద్ లో చెరువులని పట్టించుకోలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి రంగనాథ్ లాంటి గట్టి ఆఫీసర్ ని పెట్టడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. లేక్ పరిరక్షణ కమిటీలు, విద్యా సంఘాలు, కుల సంఘాలు, యువత, ప్రజల నుండి హైడ్రాకు మంచి స్పందన లభిస్తుందన్నారు. అన్ని చోట్లా లేక్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో చెరువులను కాపాడొచ్చు.. కనుక హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని మిగితా జిల్లాలకూ లేక్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎంకు కోరుతామ‌న్నారు.

కాలేజీలు, స్కూళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే విద్యార్థులకు సెలవులు ఇచ్చాక వాటిని కూల్చేయడం జరుగుతుందన్నారు. హైడ్రా వల్ల తాత్కాలికంగా కొందరికి అన్యాయం జరగొచ్చు కానీ దీర్ఘకాలికంగా ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. మూసీ నది సుందరీకరణ తర్వాత హైదరాబాద్‌కు దేశంలోని పెద్ద నగరాలు అన్నింటిలో కల్లా కొత్త రూపం వస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా పేదలకు డబ్బు ఆదాయం అవుతుందని.. అయినప్పటికీ మేము మా హామీలు నిలబెట్టుకోవట్లేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇచ్చింది. ఆగస్ట్15 నాటికి 18 లక్షల కోట్ల ఖ‌ర్చుచేసి రుణమాఫీ అందించామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అందరిని సమన్వయం చేసుకుంటూ క్యాబినెట్‌ను సమర్ధవంతంగా నడిపిస్తున్నాడని అన్నారు.

Next Story