కుర్చీలో మీ వాడిగా నేనున్నా, ఆలోచనతో పనిచేయండి..ఆ నాయకులకు సీఎం సూచన

ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..అని ఎస్సీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

By Knakam Karthik  Published on  19 March 2025 3:12 PM IST
Telangana, Cm Revanthreddy, SC Classification Bill, Congress, Brs, Bjp

కుర్చీలో మీ వాడిగా నేనున్నా, ఆలోచనతో పనిచేయండి..ఆ నాయకులకు సీఎం సూచన

ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..అని ఎస్సీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుఅమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఎస్సీ సంఘాల నాయకులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తరతరాలుగా ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మీ ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు, మన నాయకుడు రాహుల్‌గాంధీకి తెలియజేయాలి. రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మన్ కమిషన్ ఏర్పాటు చేశాం. వన్ మన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేసింది కాదు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం..అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పరిష్కారం చూపాం. సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశాం. సుప్రీంకోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ జరగలేదని గుర్తు చేశారు. కానీ మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాం. న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం, ఇప్పుడు సాధించుకున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం, పది మందికి ఉపయోగపడేలా చూడాలి. కుర్చీలో మీ వాడిగా నేనున్నా, మీకు మంచి చేయడమే ప్ప నాకు మరో ఆలోచన లేదు..అని సీఎం రేవంత్ అన్నారు.

Next Story