ఆ రోజులు మర్చిపోయావా.? : హరీశ్ రావుకు రేవంత్ రెడ్డి కౌంట‌ర్‌

దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారు. ప్రతీ ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  19 Oct 2024 8:40 AM GMT
ఆ రోజులు మర్చిపోయావా.? : హరీశ్ రావుకు రేవంత్ రెడ్డి కౌంట‌ర్‌

దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారు. ప్రతీ ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతా రెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయం. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూసాం.. కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి అని కొనియాడారు.

పేదలకు మేలు జరిగేది గాంధీ కుటుంబంతో మాత్రమేన‌ని.. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగిందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని.. ప్రధాని పదవులను త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్ ది.. పదవులను ఇతరులకు ఇచ్చి దార్శకనికతను చూపిన గొప్ప వ్యక్తులు.. గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి పోలికా.? అని ప్ర‌శ్నించారు. మత సమరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామ‌న్నారు.

హైడ్రా ఆక్రమణలకు పాల్పడ్డ బడా బాబుల పట్ల భూతం అన్నారు. ప్రభుత్వ భూములను, నాళాలు, చెరువులను ఆక్రమించుకుని పెద్ద పెద్ద భవంతులు కట్టిన వారిపట్ల హైడ్రా అంకుశం లాంటిదన్నారు. మదపుటేనుగులను అనచడానికి హైడ్రా అంకుశంలా పనిచేస్తుంది. కొందరు దీన్ని అడ్డుకోవాలని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక మూలలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దు.. వారికి నేను హామీ ఇస్తున్నా.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు.

హైడ్రా ఆగదు.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు. హైడ్రా అనగానే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు.. పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించాం.. మేం వారిని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. బిల్లా రంగాలు వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారు. అక్కడికి ఇక్కడికి కాదు.. జన్వాడ ఫామ్ హౌస్ కు పోదాం పద.. గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించుకుని కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా.? అని ప్ర‌శ్నించారు. ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే ఇక్కడ వాళ్ల డ్రామాలు అన్నారు.

హరీశ్.. నీలాంటి చెప్పులు మోసే వారు కాదు.. ఫామ్ హౌస్ లో పడుకున్న వాళ్లను రమ్మను నేను వస్తా.. నీది ఒక స్థాయేనా అని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డ రోజులు మర్చిపోయావా.? అని ప్ర‌శ్నించారు. ఫామ్ హౌసులు కాపాడుకునేందుకే బిల్లా రంగాల దొంగ ఏడ్పులని.. మూసీ పునరుజ్జీవనం వేరు.. హైడ్రా వేరు అన్నారు.

మూసీలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదన్నారు. ట్రాఫిక్ సమస్య, నాళాల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికే హైడ్రా అని వివ‌రించారు. వాళ్ల తాపత్రయం అంతా వాళ్ల ఆస్తులు కాపాడుకునేందుకు.. అక్కడికి ఇక్కడికి కాదు.. ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా.? వాళ్ల ఫామ్ హౌస్ ల వద్దకు ఎప్పుడు రావాలో హరీష్ చెప్పాలన్నారు. హరీశ్, కేటీఆర్ ఫామ్ హౌస్‌ల విషయంపై అఖిలపక్షం పిలుద్దాం.. నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు నిగ్గు తేలుద్దాం.. ఆ తరువాత మూసీ దగ్గరకా.. ఇంకెక్కడికైనానా వెళదాం అని స‌వాల్ విసిరారు.

Next Story