మల్కాజ్గిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలకు బుద్ధి చెప్తాం: కేటీఆర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
By Knakam Karthik
మల్కాజ్గిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలకు బుద్ధి చెప్తాం: కేటీఆర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపు..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్దం కావాలి. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే..స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. పోటీచేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలి. పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా కొట్లాడుతాం. అభ్యర్థులకు అండగా ఉంటాం. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ క్యాడర్.. కాంగ్రెస్ హామీలు, మోసాలు చెప్పాలి. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్ళీ నష్టపోతాం...అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేషన్ కార్డులు ఇవ్వటం గొప్ప పని కాదు, అది ప్రభుత్వం బాధ్యత. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. మల్కాజిగిరిలో ఇద్దరు కాంగ్రెస్ గుండాలు ప్రవర్తనకు బుద్ది చెప్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తే.. కాంగ్రెస్ గూండాలు లైన్లోకి వస్తారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు .. రేవంత్ రెడ్డికి లొల్లి ఎక్కువ. ఆరు గ్యారంటీల్లో..మూడు మోసాలను ప్రజలకు వివరించాలి. ఒక్కో ముసలమ్మకు రేవంత్ ప్రభుత్వం 40వేల బాకీ ఉంది. పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు. నాట్లు అప్పుడు కాకుండా.. ఓట్లు అప్పుడు రైతుబంధు వేసి సంబురాలు చేసుకోమంటున్నాడు. ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక.. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పడి ఏడుస్తున్నాడు. ఎవరు గాడిదో.. ఎవరు గుర్రమో ప్రజలకు అర్థమైంది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వానికి పార్టీకి సమ న్యాయం చేస్తాం...అని కేటీఆర్ పేర్కొన్నారు.