దాడికి ప్రతిదాడి తప్పదు, ప్రభుత్వానిదే బాధ్యత..కేటీఆర్ వార్నింగ్
కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం, దాడికి ప్రతిదాడి తప్పదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు
By - Knakam Karthik |
దాడికి ప్రతిదాడి తప్పదు, ప్రభుత్వానిదే బాధ్యత..కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్: కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం, దాడికి ప్రతిదాడి తప్పదు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో గాయపడిన భారతి, బాలరాజును యశోద హాస్పిటల్లో కేటీఆర్ పరామర్శించారు. వైద్య ఖర్చులను పార్టీనే భరిస్తుందని భరోసా ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెకు మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుంది. ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని..కేటీఆర్ హెచ్చరించారు.
భారతి, బాలరాజులపై దాడి చేసిన వారితో పాటు, దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోంది. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని హామీ. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలి..అని కేటీఆర్ పేర్కొన్నారు.