పార్టీ లోపాలను సవరించుకుంటాం, ఎవరైనా దాడికి వస్తే ఎదుర్కొంటాం: కవిత
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై, చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik
పార్టీ లోపాలను సవరించుకుంటాం, ఎవరైనా దాడికి వస్తే ఎదుర్కొంటాం: కవిత
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై, చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్న కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారణ చేశారు. నేడు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. మేం వేధింపులకు భయపడే వాళ్లం కాదు...అని కవిత వ్యాఖ్యానించారు
రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తుండగా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ విఫలతలపై ప్రజల నుండి వస్తున్న ఒత్తిడిని తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతలపై నోటీసుల పేరుతో దృష్టి మళ్లింపుదిశగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.
తాము ఏ తప్పూ చేయలేదని స్పష్టంగా చెబుతూ, వచ్చిన ప్రతి నోటీసుకు సమగ్రంగా స్పందిస్తామని చెప్పారు. కేటీఆర్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, తెలంగాణ భవన్కు తాళాలు వేసి కార్యకర్తలను నిర్బంధించడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేస్తూ, లోపాలపై చర్చించుకుని పరిష్కరించుకునే శక్తి తమకు ఉందని కవిత చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తోంది..ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.