డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయి.. ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు రేవంత్.?: హరీష్ రావు

రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik
Published on : 1 April 2025 5:45 PM IST

Telangana, Harishrao, Cm Revanthreddy, Congress Government, Brs

డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయి..ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు రేవంత్?: హరీష్ రావు

రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది అని ఎద్దేవా చేశారు. మార్చి 31వ తేదీ కల్లా రైతు భరోసా డబ్బుల రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయి. మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదు.. అని హరీష్ రావు విమర్శించారు.

ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి? దసరాకు ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఉగాదికి ఇస్తామని ఊరించారు, రైతుల్ని ఉసూరుమనిపించారు. కొత్త సంవత్సరం రైతులకు, ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేసీఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడంలేదు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నాడు. రుణమాఫీని దారుణ వంచనగా మార్చారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదే. డేట్లు మారుతున్నాయి, డెడ్‌లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు..అని హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Next Story