కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్‌ రెడ్డి

ఎల్‌ఎల్‌బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

By Knakam Karthik
Published on : 24 Feb 2025 2:10 PM IST

Telangana, SLBC Tunnel, Cm Revanth, Ex Minister JagadishReddy, Brs, Congress

కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్‌ రెడ్డి

ఎల్‌ఎల్‌బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద దురదృష్టకరం, ఎనిమిది మంది ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకున్నారనిన అన్నారు. కార్మికుల ప్రాణాలు కాపాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అని..జగదీష్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు టన్నెల్‌లో ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆతృతగా ఆరా తీస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తోలు మందంతో వ్యవహరిస్తోందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ రాజకీయాలు చేయడంలేదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఫొటోలపై ఉన్న శ్రద్ధ..ప్రాణాలు కాపాడటంలో లేదని విమర్శించారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఏ సీఎం కూడా మండలి ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం బయలుదేరి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ సీఎంతో మాట్లాడారు అన్నారు తప్ప.. మోడీని రక్షణ చర్యల గురించి అడిగినట్లు ఏం వెల్లడించలేదని ఎద్దేవా చేశారు. ప్రమాద ఘటనపై అసలు వాస్తవాలు వెల్లడించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. టన్నెల్ తవ్వేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని.. అసలు ఈ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఓ పెద్ద కుట్ర అని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని.. గత సమైక్య పాలకులు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారని జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకోవడం వల్లే ఎస్‌ఎల్‌బీసీ తెరపైకి వచ్చిందని ఆరోపించారు. చిమ్మ చీకట్లో ఆక్సిజన్ సరిగా ఇవ్వకుండా కార్మికులతో పని చేయించారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తున్నట్లు.. ఆయన అవమానవీయ ప్రవర్తనకు కార్మికులకు క్షమాపణ చెప్పాలని.. జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story