కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్ కుమార్‌ను జూన్ 10 మంగళవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 11 Jun 2025 9:42 AM IST

కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్ కుమార్‌ను జూన్ 10 మంగళవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నార‌ని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ బెయిల్‌పై విడుదలయ్యారు. అలాగే మ‌రికొన్ని కేసులలో ఆయ‌న త‌న‌ను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండటానికి కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాడు.

తాజాగా నిర్మల్ జిల్లా పోలీసులకు దిలీప్ కుమార్ పై మరిన్ని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మేరకు అతనిపై తొమ్మిది కేసులు నమోదు చేసి, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అందించిన సమాచారం ఆధారంగా.. రాష్ట్ర పోలీసులు దిలీప్ కుమార్‌ను విమానాశ్రయానికి రాగానే అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు దిలీప్ కుమార్ అరెస్టును ఖండించారు. ఇది అక్రమ అరెస్టు అని పేర్కొన్నారు. సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అదే చేసింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కొణతం దిలీప్‌ను అక్రమంగా అరెస్టు చేసేంది. ఈ మాఫియా ఎంతకాలం రేవంత్‌ను నడిపిస్తుంది? ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులకు భయపడేది లేదు. మేం పోరాట యోధులం.. న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూనే ఉంటాం’’ అని కేటీఆర్ అన్నారు.

దిలీప్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. "రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని" ఆరోపిస్తూ పలువురు పార్టీ నాయకులు దిలీప్‌ను ఉంచిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) వద్దకు చేరుకున్నారు.

Next Story