కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల, జిల్లా కేంద్రాల్లో నేడు, రేపు వివిధ రూపాల్లో నిరసన బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపనున్నారు. ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు ఇతర నిరసన రూపాల్లో నిరసనలకు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది. తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలి. కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు… తెలంగాణ నదీ జలాలను ఒక్క రాష్ట్రాలకు తరలించి, కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే. నిన్నటిదాకా సీబీఐపైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు. దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకం చేస్తున్న కుట్రనే. కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చిన, ఏ ఏజెన్సీకి ఇచ్చిన భయపడేది లేదు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం. బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైన త్యాగాలైనా చేస్తాం..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.