ఓం భూం, బుష్..ఆ నాలుగింటిలోనూ బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మించిపోయింది..బడ్జెట్‌పై బండి సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 19 March 2025 4:24 PM IST

Telangana, Assembly Budget Sessions, Congress Government, Bandi Sanjay, Bjp, Brs

ఓం భూం, బుష్..ఆ నాలుగింటిలోనూ బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మించిపోయింది..బడ్జెట్‌పై బండి సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే...డొల్ల అని తేలిపోయింది. అబద్ధాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మించిపోయింది. ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు, కేటాయింపులకు, ఆచరణకు పొంతన లేని బడ్జెట్ అని విమర్శించారు. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్థ సర్కారని తేలిపోయింది. విద్య, వైద్యరంగాలకు కేటాయింపులు దారుణం. అభయం హస్తం కాదు, మహిళల పాలిట శూన్యహస్తమని బడ్జెట్‌లో నిరూపించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. వృద్ధుల పెన్షన్‌ పెంపు గాలికొదిలేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్‌ను చిదిమే బడ్జెట్. రైతులకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెండింగ్ బిల్లులు అన్నీ ఎగవేసినట్లేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే మీకు మైనారిటీలే ముఖ్యమా? గోబెల్స్‌ను మించిన అబద్ధాల కోరులు కాంగ్రెస్ నేతలు..అని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు.

గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయింది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.... అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది.

మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే... అబద్దాలు...అంకెల గారడీ...6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం... అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది..అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Next Story