ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదే, కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?: బండి సంజయ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

By Knakam Karthik  Published on  13 March 2025 12:14 PM IST
Telangana, Congress, Bandi Sanjay, Bjp, Cm RevanthReddy

ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదే, కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?: బండి సంజయ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కొజొన్న పంటలు వేసినప్పటికీ.... ఆయా పంటలకు తగిన సమయంలో నీటిని వదలకపోవడంవల్ల ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల మేరకు పంట ఎండిపోయినట్లు మా ద్రుష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునేందుకు, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం..అని బండి సంజయ్ ఓ ప్రకటనలో చెప్పారు.

పాలకుల నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఇప్పటికే రైతు భరోసా సాయం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాక 20 లక్షలకుపైగా రైతులు అప్పులు చెల్లించకలేక అల్లాడుతున్నారు. గతంలో పంట నష్టపోతే పరిహారం అందక అరిగోస పడుతున్నారు. రైతు రాజ్యమని బీరాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి ఏం సమాధానం చెబుతుంది? కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గం..అని బండి సంజయ్ మండిపడ్డారు.

రాష్ట్రానికి, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత అష్టకష్టాలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే... వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడంతోపాటు వారికి అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ అంశాన్ని కూడా కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? ప్రభుత్వ అధినేతగా రాజకీయ నాయకుల స్టేచర్ గురించి మాట్లాడి మీడియాలో వార్తలకెక్కడం కాదు… ప్రభుత్వ అధినేతగా రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించి వారికి అండగా నిలవాలి. తక్షణమే రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీ సాక్షిగా రైతులను ఆదుకునేందుకు ప్రకటన చేయాలి. మరింత నష్టం జరగకుండా వెంటనే ప్రాజెక్టులనుండి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Next Story