ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీ కీలక ఉత్తర్వులు..సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By - Knakam Karthik |
ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీ కీలక ఉత్తర్వులు..సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో మరో సిట్ ఏర్పాటు అయ్యింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్లో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ, సిద్దిపేట కమిషనర్ ఎస్.ఎం.విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ్రెడ్డి, మాదాపూర్ డీసీపీ రితురాజ్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న నాగేందర్ సభ్యులుగా ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న సిట్ ముందు లొంగిపోయిన వారం రోజులకే ఈ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావించిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, చివరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం అక్రమంగా ట్యాప్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఏడాది మార్చిలో మాజీ డీఎస్పీ డి. ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారులతో కొత్త సిట్ను ఏర్పాటు చేయడం కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.