వైజాగ్‌లో 41 ప‌రుగులు చేస్తే.. సూర్య పేరు మారుమోగుతుంది..!

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

By -  Medi Samrat
Published on : 28 Jan 2026 9:11 AM IST

వైజాగ్‌లో 41 ప‌రుగులు చేస్తే.. సూర్య పేరు మారుమోగుతుంది..!

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకున్నప్పటికీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ ప్రత్యేకం కానుంది.

కెప్టెన్ సూర్య తన T20 అంతర్జాతీయ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స‌ర‌స‌న‌ చేరాలని చూస్తున్నాడు. ఇందుకోసం నాలుగో టీ20 మ్యాచ్‌లో 41 పరుగులు చేయాల్సి ఉంటుంది.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు భారత్‌ తరపున 102 T20 మ్యాచ్‌లు ఆడి 2,959 పరుగులు చేశాడు. ఈ అతని అత్యధిక వ్య‌క్తిగ‌త‌ స్కోరు 117 పరుగులు కాగా.. టీ20లో సూర్య పేరిట 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్ నాలుగో T20I మ్యాచ్‌లో 41 పరుగులు చేస్తే.. T20 అంతర్జాతీయ క్రికెట్‌లో 3,000 పరుగులు పూర్తి చేసిన భారతదేశపు మూడవ బ్యాట్స్‌మెన్ అవుతాడు. అతని కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రోహిత్ శర్మ. అతడు 159 మ్యాచ్‌లలో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలతో సహా 4,231 పరుగులు చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ 125 మ్యాచ్‌ల్లో 4,188 పరుగులు చేశాడు.

విశేషమేమిటంటే.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 11 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3000 పరుగుల మార్కును అధిగమించగలిగారు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ ఈ మైలురాయిని సాధిస్తే,.. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన‌ భారత ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. విరాట్ ఈ రికార్డును కేవలం 81 ఇన్నింగ్స్‌ల్లో పూర్తి చేశాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. అటువంటి పరిస్థితిలో సిరీస్ పరంగా నాలుగో టీ20 మ్యాచ్ లాంఛనప్రాయంగా ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్‌కు చిరస్మరణీయంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Next Story