పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్కు ఓ క్రికెట్ లైవ్ డిబెట్లో తీవ్ర అవమానం ఎదురైంది. డిబెట్లో క్రికెట్పై చర్చ జరుగుతుండగా షోయక్ అక్తర్ను షో హెస్ట్ సెట్ నుంచ వెళ్లిపోవలన్నాడు. దీంతో మారు మాట్లాడకుండా షోయబ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఏం జరిగిందంటే.. పీటీవీ స్పోర్ట్స్ ఛానెల్ అక్కడి ప్రభుత్వ యాజమాన్యంతో నడుస్తోంది. తాజాగా టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టుపై పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఇదే విషయమై పీటీవీ స్పోర్స్ ఛానెల్ డిబెట్ నిర్వహించింది. ఈ డిబెట్కు డాక్టర్ నౌమాన్ నియాజ్ హోస్ట్గా వ్యవహరించాడు. డిబెట్లో షోయబ్ అక్తర్కు, నౌమాన్కు మధ్య రసవత్తరంగా చర్చ సాగింది. తన వాదన నచ్చకపోతే మీరు బయటకు వెళ్లిపోవచ్చంటూ అక్తర్తో నౌమాన్ అన్నాడు.
తిరిగి అక్తర్ చెప్పే సమాధానం కూడా నౌమాన్ వినకుండా తన పనిలో పడిపోయాడు. దీంతో అక్తర్ మైక్ తీసి టేబుల్పై పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సెట్ నుంచి వెళ్లిపోవలనడం, తనతో బ్యాడ్గా ప్రవర్తించడం అవమానంగా భావించానని అక్తర్ ట్వీటర్ వేదికగా తెలిపారు. ఇక క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగనని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీటీవీ డిబెట్ నిర్వహకులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాక్ క్రికెట్కు ఎన్నో సేవలందించిన అక్తర్కు హోస్ట్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. డిబెట్ జరిగిన ఘటనపై మెజారిటీ నెటిజన్లు అక్తర్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ డిబెట్లో సర్ వివియన్ రిచర్డ్స్, ఉమర్ గుల్, రషీద్ లతీఫ్, డేవిడ్ గోవర్, ఆకిబ్ జావేద్, పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ సనా మీర్ పాల్గొన్నారు. ఈ సంఘటనపై వీరు సైతం విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.