Vijayashanti Wears Saffron Mask. గత కొన్ని రోజులుగా విజయశాంతి వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది.
By Medi Samrat Published on 1 Dec 2020 12:19 PM GMT
గత కొన్ని రోజులుగా విజయశాంతి వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న రాములమ్మ.. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత టీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ.. బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలవేళ ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగింది.
ఎన్నికల ప్రచారం కోసం జేపీ నడ్డా, అమిత్ షా హైదరాబాద్కు వచ్చారు. వారి సమక్షంలో విజయశాంతి బీజేపీలోకి వెళతారనే వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవాళ ఓటుహక్కు వినియోగించుకున్న విజయశాంతి.. ముఖానికి కాషాయ మాస్క్ ధరించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలో విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయమని మరొకసారి వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలావుంటే.. బీజేపీ ఈ మధ్య పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టింది. రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు బలమైన ప్రత్యామ్నయం మేమేనంటూ ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను తమ వైపు ఆకర్షిస్తోంది. ఇటీవల శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇక విజయశాంతి కూడా ఈ నెల 7న బీజేపీ గూటికి చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇవన్ని గాలి వార్తాలా..? నిజాలో తెలియాలంటే 7 వరకూ ఆగాల్సిందే.