అన్న‌య్య పార్టీలోకి వస్తారా.? లేదా.? అనేది నేను చెప్పలేను.. అది ఆయ‌న‌ అభిప్రాయం

Pawan Kalyan Comments In Kapu Sankshema Sena Meeting. రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని

By Medi Samrat
Published on : 30 Jan 2021 8:16 AM IST

అన్న‌య్య పార్టీలోకి వస్తారా.? లేదా.? అనేది నేను చెప్పలేను.. అది ఆయ‌న‌ అభిప్రాయం

రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని ప్రతి రాజకీయ పార్టీ మానేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం ప‌వ‌న్‌ మీడియాతో మాట్లాడుతూ.. కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్దీ ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని అన్నారు. తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయ‌న‌‌ డిమాండ్‌ చేశారు.

తాను ఓ కులానికి ప్రతినిధిని కాదని.. అందరివాడినని.. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నానన్నారు. ఉద్దానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని ప‌వ‌న్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని.. ఆ వర్గాల నేతలు రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే కార్పొరేషన్ల ఏర్పాటని వ్యాఖ్యానించారు.

ఇక అన్న‌య్య చిరంజీవిని ఉద్దేశిస్తూ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడిన‌ నైతిక మద్దతు విషయమై మాట్లాడుతూ.. చిరంజీవి ఎప్పుడూ నా మేలుకోరే చెబుతారు. తమ్ముడిగా నేను విజయం సాధించాలని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి. దాన్ని అలాగే చూడాలి. ఆయన పార్టీలోకి వస్తారా లేదా అనేది చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయమ‌ని అన్నారు.


Next Story